హైదరాబాద్, సెప్టెంబర్ 21: దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎస్ఈ) 2025 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో రిమోట్ హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గుర్తించింది. సెప్టెంబరు 12న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సీజీఎల్ పరీక్షలు సెప్టెంబర్ 26 వరకూ జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అనేక పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ భద్రతా వ్యవస్థల ద్వారా కొంత మంది అభ్యర్థుల కంప్యూటర్లను రిమోట్ టేకోవర్ చేసే ప్రయత్నాలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన వారిని డిబార్చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

