మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 27వ తేదీ నాటికి ఇది వాయుగుండంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, శనివారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *